మీ మౌనం తప్పుడు సంకేతాలు పంపిస్తోంది

ABN , First Publish Date - 2021-02-28T08:44:39+05:30 IST

అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సందర్భాల్లో డీజీపీ మౌనంగా ఉండటం తప్పుడు సంకేతాలను పంపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన

మీ మౌనం తప్పుడు సంకేతాలు పంపిస్తోంది

అధికారపార్టీకి కొమ్ముగాస్తున్న పోలీసులపై చర్య తీసుకోండి

డీజీపీకి చంద్రబాబు లేఖ


అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సందర్భాల్లో డీజీపీ మౌనంగా ఉండటం తప్పుడు సంకేతాలను పంపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన డీజీపీకి ఒక లేఖ రాశారు. ‘పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యానికి అర్ధం ఉంటుంది. కొన్నిచోట్ల పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా ఆడటాన్ని ఆ శాఖాధిపతిగా మీరు తీవ్రంగా పరిగణించాల్సిన సమయం వచ్చింది’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇళ్లపల్లిలో వైసీపీ నేతలు విజయోత్సవ ర్యాలీలో దళిత నేత కన్నూరి రాఘవ ఇంటి ముందు బాణసంచా కాల్చారని, మూడు నెలల పసిపాప ఇంట్లో ఉన్నందువల్ల అక్కడ కాల్చవద్దన్నందుకు రాఘవను, ఆయన కుమారుడిని, కుమార్తెను కొట్టారని తెలిపారు. ఆ తర్వాత బిక్కవోలు ఎస్సై సిబ్బందితో వచ్చి అప్పటికే దెబ్బలు తిన్న రాఘవ కుమారుడిని చితకబాదారని తెలిపారు.


దీనిపై టీడీపీ నేతలు పోలీ్‌సస్టేషన్‌ ముందు నిరసన తెలిపితే ఆరుగురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేసి, ఆ వెంటనే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహా పద్దెనిమిది మంది టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో సహా మరికొన్ని కేసులు పెట్టారని చంద్రబాబు వివరించారు. అనపర్తి పంచాయతీ ఎన్నికల్లో దళిత వర్గానికి చెందిన గంగాధర్‌ టీడీపీ తరపున చురుకుగా పనిచేసినందుకు వైసీపీ నేతలు దాడి చేసి కొట్టారని, అతని ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోతే మాజీ ఎమ్మెల్యే వెళ్లి స్టేషన్లో కూర్చుంటేగాని తీసుకోలేదని తెలిపారు. అధికార పార్టీ నేతలకు కొమ్ముకాసిన పోలీసులపై కఠిన చర్య తీసుకోవాలని డీజీపీని కోరారు.

Updated Date - 2021-02-28T08:44:39+05:30 IST