వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2020-10-23T08:19:39+05:30 IST
కరప మండలం పెనుగుదురులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు.
కరప, అక్టోబరు 22: కరప మండలం పెనుగుదురులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. కరప పోలీసుల వివరాల ప్రకారం.. కాజులూరు మండలం గొప్పపాలేనికి చెందిన కోక మాధవ్ (28) బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటి నుంచి కాకినాడ వచ్చిన పనులు ముగించుకుని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తిరుగు ప్రయాణమయ్యాడు. సరిగ్గా కరప మండలం పెనుగుదులోని రామలింగేశ్వరమోడరన్ రైస్మిల్లు వద్దకు వచ్చేసరికి పుల్లలలోడుతో వెళ్తున్న గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవ్ శరీరంలోకి మూడుపుల్లలు బలంగా చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. కరప పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను నమోదు చేసుకుని మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరురుగా విలపిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ ఎమ్ఆర్కే రాజు తెలిపారు.