ఆస్తి తగాదా వల్లే యువకుడి హత్య?
ABN , First Publish Date - 2020-06-07T15:10:58+05:30 IST
రైన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన హత్యకు ఆస్తి తగాదాలే కారణం కావొచ్చని పోలీసులు
హైదరాబాద్/చార్మినార్ : రైన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన హత్యకు ఆస్తి తగాదాలే కారణం కావొచ్చని పోలీసులు తెలిపారు. యాకుత్పురాకు చెందిన మహ్మద్ గాలిబ్ఖాన్కు ఇద్దరు భార్యలు. హబీబున్నీసా బేగం, రుక్సానా బేగం. హబీబున్నీసా బేగంకు ముగ్గురు, రుక్సానా బేగంకు ముగ్గురు కుమారులు ఉన్నారు.
గాలిబ్ఖాన్ సచివాలయంలోని ప్లానింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తుండేవాడు. 2011 జనవరిలో ఆయన మృతిచెందగా ఆయన పెన్షన్ డబ్బుల్లో పెద్దల సమక్షంలో రుక్సానా బేగానికి రూ.11 లక్షలు ఇచ్చారు. తమకు ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని రుక్సానా బేగం కుమారులు అప్పటి నుంచి హబీబున్నీసా బేగం, ఆమె కుమారులపై కక్ష పెంచుకున్నారు.
కొన్ని రోజుల క్రితం రుక్సానా బేగం, హబీబున్నీసా బేగంల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి రుక్సానా బేగం కుమారులు హబీబున్నీసా కుమారులను అంతం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. శుక్రవారం హబీబున్నీసా బేగం రెండో కుమారుడైన మహ్మద్ ఇమ్రాన్ను జఫర్ రోడ్డుపై హత్య చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.