ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన 10 రోజులకే ఆయువు తీరింది..!

ABN , First Publish Date - 2022-05-01T12:27:31+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూసిన యువకుడు ఉద్యోగం వచ్చిన 10 రోజులకే మృత్యు ఒడికి చేరుకున్నాడు.

ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన 10 రోజులకే ఆయువు తీరింది..!

  • రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
  • రామకోటిపురం గ్రామంలో విషాదం

కృష్ణా జిల్లా/అవనిగడ్డ రూరల్‌/కంచికచర్ల : ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూసిన యువకుడు ఉద్యోగం వచ్చిన 10 రోజులకే మృత్యు ఒడికి చేరుకున్నాడు. ఈ విషాద సంఘటన.. కొత్త ఉద్యోగంలో చేరిన ఆనందం తీరక ముందు రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడిని మృత్యువు కబళించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రామకోటిపురం పంచాయతీ పరిధిలో నివాస ముండే తోట శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు. రెండవ కుమారుడైన తోట భరత్‌ (28) ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక.


ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా అవనిగడ్డ శివారు కొత్తపేట సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితం నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌కు సహాయకునిగా ఉద్యోగం వచ్చింది. శనివారం ఉదయం నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం 65 నెంబర్‌ బైపాస్‌ రోడ్డులో బుల్లెట్‌పై భరత్‌ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. 


పీజీ వరకు చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే తపనలో ఎన్నో ఇబ్బందులు పడిన భరత్‌ ఉద్యోగం వచ్చిన 10 రోజులకే మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని, మంచి భవిష్యత్‌ ఉంటుందని కలలు కన్న మాకు విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయాడని అతడి తల్లిదండ్రులు కన్నీటి  పర్యంతమవుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-05-01T12:27:31+05:30 IST