27న వివాహం.. అంతలోనే పెను విషాదం..

ABN , First Publish Date - 2021-06-08T18:18:27+05:30 IST

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి వచ్చాడు. ఈ నెల 27న వివాహం కూడా నిశ్చయమైంది. ఏర్పా

27న వివాహం.. అంతలోనే పెను విషాదం..

  • ఇంటర్వ్యూ కోసం వెళ్తూ డాక్టర్‌ మృత్యువాత


హైదరాబాద్ సిటీ/బేగంపేట : విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి వచ్చాడు. ఈ నెల 27న వివాహం కూడా నిశ్చయమైంది. ఏర్పాట్లు కూడా చేసుకుంటుండగా, విధి ఓ ప్రమాదం రూపంలో అతడిని బలిగొంది. వివాహం జరగాల్సిన ఆ ఇంట విషాదం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్‌ కళాసిగూడకు చెందిన డాక్టర్‌ వెంకటేష్‌ అరవింద్‌, డాక్టర్‌ అజిత్‌ అన్నదమ్ములు. ఇటీవలే విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేశారు. ఓ ఆస్పత్రిలో వీరికి ఇంటర్వ్యూ ఉండడంతో ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ప్రకాశ్‌నగర్‌ బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. 


వాహనంపై ఉన్న వెంకటేష్‌ అరవింద్‌ తలపై నుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అజిత్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. జర్మనీలో మెడిసిన్‌ పూర్తి చేసి 2019లో నగరానికి వచ్చిన వెంకటేష్‌ అరవింద్‌కు తమిళనాడుకు చెందిన అమ్మాయితో ఈ నెల 27న వివాహం నిశ్చయమైంది. డ్రైవర్‌ ప్రమాదం జరిగిన వెంటనే భయంతో ట్రాక్టర్‌ను అక్కడే వదిలి పారి పోయాడు. మృతుడి తండ్రి వెంకటేష్‌ మురళీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Updated Date - 2021-06-08T18:18:27+05:30 IST