కార్వాన్ ఎమ్మెల్యేను బెదిరించిన యువకుడి అరెస్టు
ABN , First Publish Date - 2021-03-04T11:49:26+05:30 IST
కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ను ఫోన్లో బెదిరించిన...
హైదరాబాద్/బంజారాహిల్స్ : కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ను ఫోన్లో బెదిరించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే ఎమ్మెల్యే కుమారుడు జాఫర్ను కిడ్నాప్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో ఎమ్మెల్యే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కార్వాన్కు చెందిన బిలాల్ నిందితుడని తేలింది. మూడు నెలల క్రితం బిలాల్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అతని చేయి రోడ్డు పక్కనే నిలబడ్డ కౌసర్ మొయినుద్దీన్ కుమారుడు జాఫర్కు తగిలింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి జాఫర్పై కోపం పెంచుకున్నాడు. గతంలో తాను పనిచేసే కల్యాణి బిర్యానీ సెంటర్కు వెళ్లి అందరితో నవ్వుతూ మాట్లాడి అక్కడున్న ఓ సెల్ఫోన్ చోరీ చేశాడు. ఆ ఫోన్తోనే ఎమ్మెల్యేను బెదిరించనట్టు తేలింది. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.