కత్తి దూసిన ప్రేమోన్మాదం
ABN , First Publish Date - 2021-06-19T08:15:23+05:30 IST
ప్రేమిస్తున్నానంటూ ఏడాదిగా వెంటబడ్డాడు. ఆ యువతి కాదనడంతో గొంతుకోసి హత్యచేశాడు. ఆపై తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు
ప్రేమించలేదని యువతి గొంతుకోసి హత్య
ఆపై పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం
బద్వేలు రూరల్, జూన్ 18: ప్రేమిస్తున్నానంటూ ఏడాదిగా వెంటబడ్డాడు. ఆ యువతి కాదనడంతో గొంతుకోసి హత్యచేశాడు. ఆపై తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. కడప జిల్లా బద్వేలు మండలంలో జరిగిన సంఘటన వివరాలు.. బద్వేలు మండలం చింతలచెరువుకు చెందిన గొడుగునూరు సుబ్బమ్మ, సుబ్బయ్యల కుమార్తె శిరీష (19) బద్వేలు పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అట్లూరు మండలం చిన్నరాజుపల్లెకు చెందిన చరణ్ ఇంటర్తో చదువు ఆపేశాడు. పట్టణానికి వస్తూ పోతున్న క్రమంలో శిరీషను చూసి ప్రేమిస్తున్నానంటూ ఏడాదిగా ఆమె వెంట పడుతున్నాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా శిరీష తన ప్రేమను అంగీకరించకపోవడంతో.. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని చరణ్ పథకం పన్నాడు. శుక్రవారం సాయంత్రం కత్తి తీసుకుని యువతి ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో శిరీష ఇంటికి సమీపంలోని తమ పొలంలో పశుగ్రాసం కోసుకుంటోంది. నేరుగా అక్కడికి వెళ్లిన చరణ్ శిరీషతో తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన చరణ్ తన దగ్గరున్న కత్తితో శిరీష గొంతు కోశాడు. శరీరంపైనా దాడిచేసి గాయపరిచాడు. అనంతరం వెంట తెచ్చుకున్న పురుగుల మందు కొద్దిగా తాగి అక్కడే పడిపోయాడు. శిరీష వేసిన కేకలు విన్న గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే శిరీష మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్రామస్తులు చరణ్కు దేహశుద్ధి చేసి రూరల్ పోలీసులకు అప్పగించారు.