రైలు ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-04-10T05:48:18+05:30 IST
మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన బొంగు శ్రీనివాసరావు (35) అనే యువకుడు శుక్రవారం రైలు ఢీకొని మృతిచెందాడు.
టెక్కలి రూరల్, ఏప్రిల్ 9: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన బొంగు శ్రీనివాసరావు (35) అనే యువకుడు శుక్రవారం రైలు ఢీకొని మృతిచెందాడు. పట్టణంలోని ఒక ఎలక్ర్టానిక్ దుకాణంలో పనిచేస్తున్న ఈయన శుక్రవారం వేకువజామున రైలు కింద పడి మృతిచెందాడు. అయితే ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందాడా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో మృతదేహం నుజ్జు నుజ్జయింది. చేతులు, కాళ్లు దూరంగా పడిపోయి ఉన్నాయి. మృతుడు శ్రీనివాసరావుకు ఏడాది కిందట వివాహం జరిగింది. ఇదే విషయమై పలాస జీఆర్పీ హెచ్సీ కోదండరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా వ్యక్తి మృతిపై తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.
విద్యుదాఘాతంతో ఒకరు..
పాలకొండ: వీరఘట్టంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఏటీఎంలో తలెత్తిన సాంకేతికపరమైన సమస్యను పరిష్కరించేందుకు హర్యానా నుంచి వచ్చిన టెక్నీషి యన్ అజయ్శర్మ(42) శుక్రవారం విద్యుత్ షాక్కు గురై మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం స్థానిక ఎస్బీఐ ఏటీఎం సక్రమంగా పని చేయకపో వడంతో దానిని మరమ్మతు చేసేందుకు అజయ్శర్మ వచ్చారు. మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఏటీఎం మెషిన్ వద్ద విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బ్యాంక్ మేనేజర్ కె.మురళీని సంప్రదించగా ఏటీఎం మరమ్మతుల కోసం వచ్చిన ప్రైవేటు ఏజెన్సీ వ్యక్తి అని తెలిపారు. ఈయన మృతి చెందిన విషయాన్ని సంబంధిత కంపెనీకి సమాచారం ఇస్తామన్నారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు..
హరిపురం, ఏప్రిల్ 9: మందస మండలం వీరగున్నమ్మపురం గ్రామానికి చెందిన దుప్పల విజయ్(28) గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు విజయ్ కాశీబుగ్గ పరిధిలోని పెంటిపద్ర వద్ద విద్యుత్తు సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల కిందట ఒక అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. కాశీబుగ్గలో నివాసం ఉంటూ గురువారం ఉదయం విధులు ముగించి ఇంటికి చేరుకుని సక్రమంగానే ఉన్నాడని, రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయం చూసేసరికి వేరే గదిలో విజయ్ మృతదేహం ఉన్నట్లు భార్య గుర్తించింది. వెంటనే స్థానికులకు సమాచారం అందించింది. ఈ సంఘటనతో స్వగ్రామమైన వీరగున్నమ్మపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటనపై ఎలాంటి సమాచారం లేదని మందస పోలీసులు తెలిపారు.