హల్దీవాగులో పడి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-06-22T05:05:29+05:30 IST
హల్దీవాగులో పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వర్గల్ మండలంలో సోమవారం చోటు చేసుకున్నది.
వర్గల్, జూన్ 21 : హల్దీవాగులో పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వర్గల్ మండలంలో సోమవారం చోటు చేసుకున్నది. పోలీసులు, కుటుంబీకుల వివరాల ప్రకారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అచ్చంపేటకు చెందిన నెల్లూరి పరశురాములు (30) డ్రైవర్గా పనిచేస్తుంటాడు. 8 ఏళ్ల క్రితం గజ్వేల్ మండలం క్యాసారం గ్రామానికి చెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి కూతుళ్లు చిందు (7), సింధు (6) ఉన్నారు. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. నాలుగు నెలల క్రితం భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా శనివారం కవితను తీసుకురావడానికి పరశురాములు వెళ్లాడు. పెద్దల సమక్షంలో మాట్లాడిన తర్వాత వస్తానని తేల్చిచెప్పడంతో తిరిగి వెళ్లాడు. సోమవారం ఉదయం హల్దీవాగు సమీపంలో బైక్ పెట్టి వాగులో శవమై కనిపించాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు గౌరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వీరన్న తెలిపారు.