వైసీపీ టికెట్ రాకపోవడంతో యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-03-03T01:57:17+05:30 IST
తనకు వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో దళిత యువకుడు ఆత్మహత్యా యత్నానికి
రాజమండ్రి: తనకు వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో దళిత యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మండపేట మున్సిపాలిటీలోని ఏడవ వార్డు ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఇక్కడి నుంచి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి గత ఏడాది సవరపు సతీష్కు టికెట్ కేటాయించారు. తరువాత కోవిడ్ కారణంగా ఎన్నికలు జరుగలేదు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో తనకే మళ్లీ టికెట్ కేటాయిస్తారని సతీష్ భావించాడు.
అయితే ఏడవ వార్డులో అభ్యర్థిని మార్చి సతీష్ను కాదని మరొకరి పేరును వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీంతో తనకు టికెట్ రాలేదన్న మనస్థాపంతో నామినేషన్ వేసిన సవరపు సతీష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సతీష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది టికెట్ కేటాయించి ఇప్పుడు మరో వ్యక్తికి టికెట్ ఖరారు చేయటంతోనే దళిత యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని స్థానికులు భావిస్తున్నారు.