మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-16T11:53:29+05:30 IST
మానసిక స్థితి సరిగా లేక ఒత్తిడికి లోనైన ఓ యువతి ఆత్మహత్య
హైదరాబాద్/వనస్థలిపురం : మానసిక స్థితి సరిగా లేక ఒత్తిడికి లోనైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె ఏడాది క్రితం బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఓ ఇనిస్టిట్యూట్లో చేరింది. అక్కడ నరేందర్ అనే వ్యక్తి, ఆమెను మాయమాటలతో మోసం చేశాడు. తీరా అతనికి పెళ్లైన విషయం తెలియడంతో ఆ యువతి మానసికంగా కృంగిపోయింది. ఆ తర్వాత ఇంట్లో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించేది.
ఇలా శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అనంతరం గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. అలవాటు ప్రకారం.. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు వెళ్లి పిలవగా.. ఎలాంటి స్పందన లేదు. దాంతో కంగారుపడిన తల్లిదండ్రులు, ఆమె సోదరుడు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకొని విగతజీవిగా మారి కనపడింది. తన కుమార్తెకి ఇలాంటి పరిస్థితికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనస్థలిపురం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.