48వేలు అకౌంట్లో వేశాక యువతి ఫోన్ స్విచాఫ్..
ABN , First Publish Date - 2021-05-07T17:53:05+05:30 IST
తాను త్వరలోనే హైదరాబాద్ వస్తున్నానని, ఇద్దరం వివాహం చేసుకుందామని..
హైదరాబాద్/రాజేంద్రనగర్ : ఓ వివాహ పరిచయ వేదిక ద్వారా పరిచయమైన దుబాయ్ ఖతార్కు చెందిన యువతి సులేమాన్నగర్కు చెందిన ఓ యువకుడి కుటుంబ సభ్యుల నుంచి రూ.48వేలు తన అకౌంటులో వేయించుకుని బురిడీ కొట్టించింది. సులేమాన్నగర్లో నివసించే యూసుఫ్ హసన్ సోదరుడు వివాహ పరిచయ వేదికలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అతనికి దుబాయ్ ఖతార్కు చెందిన ఓ యువతి ఫోన్లో పరిచయమైంది. తాను త్వరలోనే హైదరాబాద్ వస్తున్నానని, ఇద్దరం వివాహం చేసుకుందామని నమ్మించింది.
బుధవారం ఆమె ఆ యువకుడికి ఫోన్ చేసి తాను హైదరాబాద్ ఎయిర్ఫోర్ట్కు వచ్చానని, తన లగేజీకి ఫైన్ పడిందని, రూ. 48వేలు కావాలని, తన వద్ద అన్నీ యూరోలు ఉన్నాయని, తనకు రూ. 48వేలు పంపించాలి’ అని చెప్పింది. నమ్మిన యువకుడు సోదరుడికి చెప్పి ఆ యువతి అకౌంటులో డబ్బులు జమ చేయించాడు. తర్వాత యువతికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు అన్న యూసుఫ్ హసన్తో కలసి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కె.కనకయ్య తెలిపాడు.