47 ఏళ్ల వ్యక్తితో వివాహం నిశ్చయించిన తండ్రి.. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న కూతురిపై దౌర్జన్యం.. ఏకంగా ప్రధానికే లేఖ రాసిన యువజంట!

ABN , First Publish Date - 2022-02-04T19:45:41+05:30 IST

అతను తన కన్న కూతురితోనే కిరాతకంగా ప్రవర్తించాడు.. ఆమె ప్రేమను తిరస్కరించాడు..

47 ఏళ్ల వ్యక్తితో వివాహం నిశ్చయించిన తండ్రి.. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న కూతురిపై దౌర్జన్యం.. ఏకంగా ప్రధానికే లేఖ రాసిన యువజంట!

అతను తన కన్న కూతురితోనే కిరాతకంగా ప్రవర్తించాడు.. ఆమె ప్రేమను తిరస్కరించాడు.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా 47 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయించాడు. తన కంటే 28 ఏళ్ల పెద్ద వయసు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది.. తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.. దాంతో కూతురి, అల్లుడిని చంపేందుకు దాడి చేశాడు.. తప్పించుకున్న వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆ యువజంట ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసింది. రాజస్థాన్‌లోని ఢోలాపూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఢోలాపూర్‌ జిల్లాలోని మానియ గ్రామానికి చెందిన 19 ఏళ్ల తను అనే యువతి 22 ఏళ్ల భరత్‌ను వివాహం చేసుకుంది. తన తండ్రి 47 ఏళ్ల వ్యక్తితో వివాహం నిశ్చయించడంతో ఇంటి నుంచి పారిపోయి భరత్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అప్పట్నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తండ్రి, సోదరుడు వీరిని చంపేందుకు ప్రయత్నించారు. రోజూ బెదిరిస్తున్నారు. దీంతో యువ దంపతులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు పట్టించుకోలేదు. దీంతో ఏకంగా రాజస్థాన్ హైకోర్టులో తమ రక్షణ కోసం పిటిషన్ వేశారు. 


ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆ యువజంటకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అయినప్పటికీ పోలీసుల నుంచి సరైన స్పందన లేదు. తను తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. దీంతో ఆ యువ దంపతులు తమ పరిస్థితిని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా వేడుకున్నారు. 


Updated Date - 2022-02-04T19:45:41+05:30 IST