పోలీస్ శాఖలోకి యువ రక్తం!
ABN , First Publish Date - 2021-07-22T07:26:00+05:30 IST
రాష్ట్ర పోలీస్ శాఖలోకి యువరక్తం రాబోతుంది. రాష్ట్రంలోని 10 బెటాలియన్లలో దాదాపు 3,800
- 3800 మంది టీఎ్సఎస్పీ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి
- నేటి నుంచి పాసింగ్ అవుట్ పరేడ్లు.. 28న విధుల్లోకి
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీస్ శాఖలోకి యువరక్తం రాబోతుంది. రాష్ట్రంలోని 10 బెటాలియన్లలో దాదాపు 3,800 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారంతా ఈ నెల 28న విధుల్లో చేరనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు బెటాలియన్లలో టీఎ్సఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్లు జరగనున్నాయని పేర్కొన్నారు. సాధారణంగా పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత విధుల్లో చేరడానికి కానిస్టేబుళ్లకు కొంత సమయం ఇస్తారు. కానీ, ఈ సారి కానిస్టేబుళ్ల సేవలను వెంటనే వినియోగించుకోవాలని పోలీ్సశాఖ భావిస్తోంది.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రాజకీయ పార్టీల ధర్నాలు, ఇతర కార్యక్రమాలు పెరిగిపోవడం, పోలీసు సిబ్బంది కొరత ఉండడంతో బందోబస్తు విధులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 3,800 మంది టీఎ్సఎస్పీ కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సీనియారిటీ సమస్య రాకుండా ఉండేందుకు ఈనెల 26న అందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయాలని అందులో పేర్కొన్నారు.
కానిస్టేబుళ్లందరూ ఈ నెల 28న బెటాలియన్లలో రిపోర్టు చేయాలని నిర్దేశించారు. కాగా, హైదరాబాద్లోని కొండాపూర్ 8వ బెటాలియన్లో గురువారం జరిగే పాసింగ్ అవుట్ పరేడ్కు హోం మంత్రి మహబూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి హాజరుకానున్నారు.