మీకు దండం పెడతాం.. కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వండి
ABN , First Publish Date - 2021-08-04T04:10:06+05:30 IST
‘పట్టా భూమి ఉండి పాస్ పుస్తకాలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని మండలంలోని దోమడుగు గ్రామానికి చెందిన మహిళా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై మంగళవారం ధర్నా చేపట్టారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా రైతుల ధర్నా
గుమ్మడిదల, ఆగస్టు 3 : ‘పట్టా భూమి ఉండి పాస్ పుస్తకాలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని మండలంలోని దోమడుగు గ్రామానికి చెందిన మహిళా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై మంగళవారం ధర్నా చేపట్టారు. దోమడుగు గ్రామంలో వివిధ సర్వే నెంబర్లలో 30 ఎకరాల భూమిలో మహిళా రైతులు పట్టా పొంది సాగు చేసుకుంటున్నారు. ఆయా భూముల్లో ఎలాంటి వివాదాస్పదం లేకున్నా సమగ్ర సర్వే చేయాలని, గతంలో ఉన్న అధికారులు పార్టు-బీలోకి మార్చారు. కానీ ఇప్పటివరకు సర్వే చేసి, పాస్ పుస్తకాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు వివరించినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా రైతులు జాతీయ రహదారి పై అరగంటపాటు ఆందోళన చేపట్టారు. ఎస్ఐ విజయకృష్ణ అక్కడికి చేరుకుని తహసీల్దార్తో మాట్లాడి కొత్త పాస్ పుస్తకాలు అందించే విధం గా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.