పోలవరం ముంపును తేల్చాల్సిందిమీరేగా..?

ABN , First Publish Date - 2022-08-06T09:23:34+05:30 IST

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ వల్ల కలిగే ముంపు ముప్పును తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కే ఉందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

పోలవరం ముంపును తేల్చాల్సిందిమీరేగా..?

  • మా లేఖను ఏపీకి ఎందుకు పంపించారు?
  • పీపీఏ తీరుపై తెలంగాణ ఆగ్రహం

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ వల్ల కలిగే ముంపు ముప్పును తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కే ఉందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కానీ, పీపీఏ మాత్రం తన బాధ్యతను విస్మరించిందని.. తాము లేవనెత్తిన అభ్యంతరాలను ఏపీకి పంపడంపై గుర్రుగా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణలోని 74 గ్రామాలు నీట మునుగుతాయని, 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే 92 గ్రామాలు మునిగిపోవడమేగాక 1.2 లక్షల మంది నిర్వాసితులయ్యే అవకాశం ఉంది. అలాగే భద్రాచలంలోని రామాలయం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవలే తెలంగాణ సర్కారు పీపీఏకు లేఖ రాసింది. దాన్ని పీపీఏ సీఈవోతో పాటు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కు పంపించింది.


 అయితే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ పీపీఏ.. లేఖను ఏపీకి పంపడం పట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోలవరం నిర్మాణ బాధ్యతను మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ తీసుకుందని.. అది జాతీయ ప్రాజెక్టు కావడంతో నిర్మాణం, దానివల్ల కలిగే ప్రభావం, ఇతర అన్ని అంశాలపై చర్యలు తీసుకునే అధికారం పీపీఏకే ఉందని స్పష్టం చేసింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై స్వతంత్ర సంస్థతో సమగ్ర అధ్యయనం చేయించాలని కోరింది. భద్రాచలం ఆలయంతో పాటు మణుగూరులోని భార జల కేంద్రం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుచేసింది. ముంపు ముప్పును తేల్చే బాధ్యత ఏపీకి  అప్పగిస్తే.. స్వతంత్ర సంస్థతో అధ్యయనం ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. పీపీఏ తీరును ఎండగడుతూ మరో లేఖను రాయాలని తెలంగాణ నిర్ణయించింది.

Updated Date - 2022-08-06T09:23:34+05:30 IST