మీ నుంచి నేను స్ఫూర్తి పొందాను: పారాలింపియన్లతో ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-09-12T22:18:17+05:30 IST

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండించిన పారాలింపియన్లతో భారత ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు.

మీ నుంచి నేను స్ఫూర్తి పొందాను: పారాలింపియన్లతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండించిన పారాలింపియన్లతో భారత ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల హృదయాలు గెలుచుకున్నారని ప్రశంసించారు. గురువారం మోదీ తన నివాసంలో టోక్యో పారాలింపిక్స్ బృందంతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. 


టోక్యో పారాలింపిక్స్‌లో మొత్తం 54 మంది భారత అథ్లెట్లు 9 స్పోర్ట్స్ ఈవెంట్‌లలో పాల్గొన్నారు. 5 పసిడి, 8 రజతం, ఆరు కాంస్య పతకాలతో మొత్తం 19 పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ‘‘మీ నుంచి నేను ప్రేరణ పొందాను. మీరు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు’’ అని మోదీ పేర్కొన్న వీడియోను నేడు (ఆదివారం) బయటకు వచ్చింది.


‘‘మీ విజయాలతో ఓటమివాద ధోరణిని ఓడించారు. ఇది చాలా గొప్ప విషయం. మీ ద్వారా చిన్న విషయాలు కూడా దేశాన్ని ఎంతగానో చైతన్య పరచగలవు. స్కూళ్లు, ఇతర ప్రాంతాలను సందర్శించడం ద్వారా దేశాన్ని మున్ముందు మరింతగా చైతన్య పరచగలరు’’ అని ప్రధాని అన్నారు.


కొవిడ్-19 వారియర్లకు తన పతకాన్ని అంకితం చేయడం గురించి ప్రధాని మోదీ అడిగిన ప్రశ్నకు స్వర్ణ పతక విజేత కృష్ణ నాగర్ మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టిమరీ సేవలు అందించడం తాను చూశానని, అదే తనను ఈ పనికి పురికొల్పిందని నాగర్ బదులిచ్చాడు.


అథ్లెట్ల అద్భుత ప్రదర్శనకు అచ్చెరువొందిన ప్రధాని వారిని అభినందించారు. పారా అథ్లెట్ల విజయాలు దేశంలో క్రీడలపై స్ఫూర్తిని రగిలిస్తాయని, క్రీడాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. దివ్యాంగులకు కోచింగ్ కోసం ఓ వర్క్‌షాప్ అవసరమని అభిప్రాయపడిన మోదీ.. ఓ పుస్తకం కూడా రాయవచ్చని అన్నారు.

Updated Date - 2021-09-12T22:18:17+05:30 IST