లఖింపూర్ ఘటనపై ప్రతిపక్షాలకు యోగి వార్నింగ్
ABN , First Publish Date - 2021-10-06T23:25:02+05:30 IST
లఖింపూర్ పరిస్థితుల దృష్ట్యా అక్కడికి ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ కొందరు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద ఘటన వల్ల ప్రస్తుతం అక్కడ వాతావరణం చాలా సున్నితంగా ఉంది..
లఖ్నవూ: లఖింపూర్ ఘటన సున్నిత అంశమని, దీనిని అడ్డు పెట్టుకుని ఉత్తరప్రదేశ్లో వాతావరణాన్ని పాడు చేయాలని ప్రయత్నించొద్దని ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక చేశారు. లఖింపూర్కు కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాక సందర్భంగా ఏర్పడిన పరిస్థితులపై బుధవారం ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘లఖింపూర్ పరిస్థితుల దృష్ట్యా అక్కడికి ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ కొందరు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద ఘటన వల్ల ప్రస్తుతం అక్కడ వాతావరణం చాలా సున్నితంగా ఉంది. అక్కడి వాతావరణం పాడు అవుతుందనే ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పట్లో అక్కడికి ఎవరూ వెళ్లే ప్రయత్నం చేయొద్దు’’ అని యోగి అన్నారు.
కాగా, ఇదే విషయమై ఉత్తరప్రదేశ్ మంత్రి శ్రీనాథ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లఖింపూర్ బాధిత కుటుంబాలతో సెల్ఫీలు దిగేందుకే ప్రతిపక్ష పార్టీ నేతలు అక్కడికి వెళ్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పర్యటన కూడా అందుకే అని ఆయన ఎద్దేవా చేశారు.