గంగా నదిలో మురికి నీళ్ళున్నాయని యోగికి తెలుసు : అఖిలేశ్ యాదవ్
ABN , First Publish Date - 2021-12-14T21:26:40+05:30 IST
గంగా నది జలాలు మురికిగా ఉన్నాయని ఉత్తర ప్రదేశ్
లక్నో : గంగా నది జలాలు మురికిగా ఉన్నాయని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తెలుసునని, అందుకే ఆయన పవిత్ర స్నానం ఆచరించలేదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. గంగా నది ప్రక్షాళన కోసం బీజేపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందన్నారు. గంగమ్మ ఏనాటికైనా పరిశుభ్రంగా ఉంటుందా? అనేదే ప్రశ్న అన్నారు. నిధులు ప్రవహించాయని, నది మాత్రం పరిశుభ్రంకాలేదని చెప్పారు.
అఖిలేశ్ యాదవ్ మంగళవారం ఉత్తర ప్రదేశ్లోని సైఫాయిలో మీడియాతో మాట్లాడుతూ, వారణాసిలో కాశీవిశ్వనాధునికి ఒక నెలపాటు ఉత్సవాలు జరుగుతాయని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు కేవలం ఒకట్రెండు నెలలు మాత్రమే ఇక్కడ ఉండకూడదని, ప్రజలు వారణాసిలో తమ చివరి క్షణాలను గడుపుతూ ఉంటారని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు. గంగా హారతిని వీక్షించారు. మోదీతో కలిసే ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ పవిత్ర స్నానం ఆచరించలేదు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగుతాయి. సమాజ్వాదీ పార్టీ, బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.