గ్యాంగ్స్టర్ అక్రమ కట్టడాలను కూల్చేసిన యోగి బుల్డోజర్
ABN , First Publish Date - 2022-03-16T00:41:25+05:30 IST
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరుతో పాపులర్ అయిన 'బుల్డోజర్' మళ్లీ కార్యరంగంలోకి ..
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరుతో పాపులర్ అయిన 'బుల్డోజర్' మళ్లీ కార్యరంగంలోకి దిగింది. పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ బదన్ సింగ్ బడ్డూ ఒక పార్కులో అక్రమంగా నిర్మించిన ఫ్యాక్టరీని, మార్కెట్ను మంగళవారంనాడు బుల్డోజర్ నేలమట్టం చేసింది. దీంతో ఆక్రమణల నుంచి పార్క్ ప్రాంతానికి విముక్తి కలిగింది.
మీరట్ పోలీసులు, మీరట్ డవలప్మెంట్ అథారిటీ అధికారులు ఉదయమే మీరట్లోని టీవీ నగర్ ఏరియాలో ఉన్న జగన్నాథపురికి బుల్డోజర్తో సహా చేరుకున్నారు. బడ్డూ, ఆయన మనుషులు అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసి పార్క్ ప్రాంతానికి విముక్తి కల్పించారు. దీనిపై మీరట్ పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ, ల్యాండ్ మాఫియా క్రమక్రమంగా పార్క్ను ఆక్రమించుకుని రేణుగుప్తా పేరుతో ఒక భవంతి నిర్మించిందని, లీగల్ పరమైన వ్యవహారాలన్నీ పూర్తి చేసిన తర్వాత కట్టడాల కూల్చివేతకు మీరట్ డవలప్మెంట్ అథారిటీ ఆదేశాలిచ్చిందని తెలిపారు. ఇంతకుముందు కూడా, బదన్ సింగ్ బడ్డూకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భవనాలను మీరట్ డవలప్మెంట్ అథారిటీ, మీరట్ పోలీసులు కూల్చేశారు.