ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నెం.2 స్థానంలో నిలిపాం : యోగి ఆదిత్యనాథ్

ABN , First Publish Date - 2022-02-03T18:24:40+05:30 IST

గడచిన ఐదేళ్ళలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని

ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నెం.2 స్థానంలో నిలిపాం : యోగి ఆదిత్యనాథ్

లక్నో : గడచిన ఐదేళ్ళలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వ పాలనా కాలంలో మతపరమైన హింసాత్మక సంఘటనలు, ఉగ్రవాద దాడులు జరగలేదన్నారు. 


పెట్టుబడిదారులకు ప్రధాన ఎంపికగా తమ రాష్ట్రాన్ని నిలిపామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తన నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను 14 నుంచి రెండో స్థానానికి తీసుకెళ్లిందన్నారు. అంతకుముందు పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారని చెప్పారు. అగ్ర స్థానంలో ఉన్న మూడు రాష్ట్రాలనే వారు ఎంపిక చేసుకుంటారన్నారు. టెక్నికల్, ఇతర రంగాలవారీగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందన్నారు. తన ప్రభుత్వ కృషి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంలో రెండో స్థానానికి చేరిందని తెలిపారు. కేవలం ఐదేళ్ళలోనే తాము దీనిని సాధించినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తలసరి ఆదాయం సంవత్సరానికి రూ.47,000 ఉండేదని, ఇప్పుడు దీనిని రూ.54,000కు తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు పెంచామన్నారు. 


కోవిడ్-19 మహమ్మారి వల్ల వచ్చిన సంక్షోభాన్ని తన ప్రభుత్వం దీటుగా ఎదుర్కొందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి వయోజన వ్యక్తి కోవిడ్ టీకా మొదటి మోతాదును తీసుకున్నారని, సుమారు 70 శాతం మంది అర్హులు రెండు మోతాదులు తీసుకున్నారని తెలిపారు. ఈ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనడంలో తమ రాష్ట్రాన్ని దేశానికి ఓ ఉదాహరణగా నిలిపామని చెప్పారు. 


403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌ శాసన సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-02-03T18:24:40+05:30 IST