Yogi Adityanath : మహిళలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాఖీ పండుగ కానుక
ABN , First Publish Date - 2022-08-06T17:08:59+05:30 IST
సోదర, సోదరీమణుల ఆప్యాయత, అనురాగాలకు గుర్తుగా జరుపుకునే
లక్నో : సోదర, సోదరీమణుల ఆప్యాయత, అనురాగాలకు గుర్తుగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సందర్భంగా మహిళామణులకు ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఓ కానుకను ప్రకటించింది. మహిళలు 48 గంటలపాటు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) శుక్రవారం ఈ వివరాలను ఓ ట్వీట్ ద్వారా తెలిపారు.
యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ట్వీట్లో, రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలంతా బస్సుల్లో సురక్షితంగా ఉచితంగా ప్రయాణించేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. ఆగస్టు 10 అర్ధ రాత్రి నుంచి ఆగస్టు 12 అర్ధరాత్రి వరకు (48 గంటలు) మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు.
రక్షా బంధన్తోపాటు స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా మహిళలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కానుక ఇస్తోంది. శ్రావణ మాసం పౌర్ణమినాడు (ఆగస్టు 12న) రాఖీ పండుగ జరుగుతుందన్న సంగతి తెలిసిందే.