ఉత్తర ప్రదేశ్ రైతులకు యోగి ప్రభుత్వం శుభవార్త!

ABN , First Publish Date - 2021-03-11T22:56:11+05:30 IST

కొత్త సాగు చట్టాలపై తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు

ఉత్తర ప్రదేశ్ రైతులకు యోగి ప్రభుత్వం శుభవార్త!

లక్నో : కొత్త సాగు చట్టాలపై తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల వద్ద ఉన్న గోధుమలన్నిటినీ పెరిగిన ఎంఎస్‌పీ ధర చెల్లించి సేకరిస్తామని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు గోధుమలను సేకరించనున్నట్లు ప్రకటించింది. 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు గురువారం తెలిపిన వివరాల ప్రకారం, పెంచిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లించి గోధుమలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రైతుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. గోధుమల సేకరణ ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు జరుగుతుంది. 


గోధుమలకు ఎంఎస్‌పీ గత ఏడాది క్వింటాలుకు రూ.1925 ఉండేది. దీనిని రూ.50 పెంచారు. దీంతో 2021-22లో క్వింటాలు గోధుమలకు ఎంఎస్‌పీ రూ.1975కు చేరింది. గోధుమల సేకరణకు పరిమితులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. రైతుల వద్ద గోధుమల నిల్వలు పూర్తయ్యే వరకు సేకరణను కొనసాగించాలని నిర్ణయించింది. రైతులు తమ వద్దనున్న గోధుమలను ఎంత మేరకు అమ్మాలనుకుంటే అంత వరకు కొనాలని నిర్ణయించింది. 


Updated Date - 2021-03-11T22:56:11+05:30 IST