యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2020-08-02T17:11:50+05:30 IST

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన వాయిదా పడింది.

యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన వాయిదా

అయోధ్య : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం ఆయన ఈ నెల 5న జరిగే రామాలయం భూమి పూజ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం అయోధ్యకు రావలసి ఉంది. తన మంత్రివర్గంలోని ఓ మంత్రి మరణించడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. 


రాష్ట్ర మంత్రి కమల రాణి వరుణ్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని జూలై 18న నిర్థరణ అయింది. ఆమె లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 2) తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో యోగి తన పర్యటనను రద్దు చేసుకున్నారు.


రామాలయం నిర్మాణానికి భూమి పూజ ఆగస్టు 5న జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. భూమి పూజకు ఏర్పాట్లను పరిశీలించేందుకు యోగి ఆదిత్యనాథ్ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అయోధ్య రావలసి ఉంది. ఆయన హనుమాన్‌గడి దేవాలయం, రామ్ కీ పౌడీలను కూడా సందర్శించవలసి ఉంది.  ఈ కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. 


యోగి ఆదిత్యనాథ్ హనుమాన్‌గడిలో ఆదివారం నిర్వహించాలనుకున్న నిషాన్ పూజను మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారని శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా చెప్పారు.


Updated Date - 2020-08-02T17:11:50+05:30 IST