దిగుబడి అంతంతే...
ABN , First Publish Date - 2022-04-24T04:44:13+05:30 IST
పంట బాగా ఉన్న దశలో కరెంటు కోతలతో నీటితడులందక వేరుశనగ రైతు నిండా నష్టపోయాడు.
కరెంటు కోతలతో నీటితడులందక
వాడిపోతున్న వేరుశనగ కట్టె
నష్టపోయిన రైతులు
సంబేపల్లె, ఏప్రిల్ 23: పంట బాగా ఉన్న దశలో కరెంటు కోతలతో నీటితడులందక వేరుశనగ రైతు నిండా నష్టపోయాడు. మండల వ్యాప్తంగా వ్యవసాయ బోరుబావుల కింద 976 హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేశారు. పంట వేసిన మొదట్లో భారీ వర్షాలతో కొన్నిచోట్ల గింజలు సరిగ్గా మొలకెత్తలేదు. దీనికితోడు కలుపు అధికం కావడంతో కలుపు నివారణకు రైతుకు అదనపు ఖర్చు వచ్చింది. ప్రస్తుతం పంట దిగుబడి వచ్చే సమయంలో కరెంటు కోతలతో నీటి తడులు సక్రమంగా అందక కట్టె వాడిపోవడంతో పాటు కాయలు లొట్టపోయాయని రైతులు వాపోతున్నారు. మండల వ్యాప్తంగా ప్రస్తుతం కూలీలు వేరుశనగ నూర్పిడి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. పొలం వద్ద కాయలు రాశిగా పోసి పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 42 కేజీలు రూ.2,600 నుంచి రూ.2,800 ఉండగా ప్రభుత్వం ఒక కేజీ రూ.55.50 ధరకు కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖాధికారి వెంకటమోహన్ తెలిపారు. రైతులు దళారుల చేతుల్లో నష్టపోవద్దని ప్రభుత్వమే వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేస్తుందని చెప్పారు.