దిగుబడి దెబ్బ

ABN , First Publish Date - 2022-01-24T04:38:22+05:30 IST

ఆరుగాలం కష్టించి పంట పండించే రైతులు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో నష్టాలను చవి చూడాల్సి వస్తోంది.

దిగుబడి దెబ్బ
ఎండిపోయిన మొక్కజొన్న పంటను చూపుతున్న రైతులు

  1. ఎకరాకు ఐదు క్వింటాళ్ల మొక్కజొన్న
  2. తీవ్రంగా నష్టపోయిన రైతులు 

చాగలమర్రి, జనవరి 23: ఆరుగాలం కష్టించి పంట పండించే రైతులు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. చాగలమర్రి మండలంలో ఈ ఏడాది 1,500 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా ఖర్చు చేశారు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. పచ్చగా ఏపుగా పెరగడంతో అధిక దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలిం ది. మొక్కజొన్న కంకులలో గింజులు లేక దిగుబడి కేవలం 3 నుంచి 5 క్వింటాళ్లు  మాత్రమే రావడంతో రైతులు ఆవేదన చెందు తున్నారు. గత ఏడాది ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి రావడంతో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పంట సాగు చేశారు. వైరస్‌, అధిక వర్షాల వల్ల పంట దెబ్బతింది. సీడు విత్తనాలు కొనుగోలు చేసి పంట సాగు చేస్తే దిగుబడి రాక నష్టపోయామని రైతులు వాపో తున్నారు. దిగుబడి లేక కొందరు రైతులు మొక్కజొన్న పంట కొయ్యకుండానే వదిలేశారు. కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


ప్రభుత్వమే ఆదుకోవాలి

మొక్కజొన్న పంట చేతికందే సమయంలో వర్షాలు కొంపముంచాయి. ఏడు ఎకరాల్లో సాగు చేస్తే 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి, రూ.25 వేలు కౌలు చెల్లించా. రూ.3.50 లక్షల దాకా నష్టపోయాను. ఈ సారి రైతులను నట్టేటా ముంచింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. 

- మాబువలి, కౌలు రైతు, చాగలమర్రి 

Updated Date - 2022-01-24T04:38:22+05:30 IST