శ్రీనివాస్గౌడ్ను చంపాలనుకున్నాం.. సంచలన విషయాలు వెల్లడించిన రాఘవేంద్రరాజు
ABN , First Publish Date - 2022-03-03T20:39:04+05:30 IST
మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్యా యత్నం కేసు నమోదైంది. మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్యా యత్నం కేసు నమోదైంది. మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘2017 నుంచి నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు. నన్ను, నా కుటుంబాన్ని శ్రీనివాస్గౌడ్ టార్గెట్ చేశారు. శ్రీనివాస్గౌడ్ నుంచి ప్రాణ హాని ఉంది. వేధింపులు తట్టుకోలేకే శ్రీనివాస్గౌడ్ను చంపాలనుకున్నా. నాపై శ్రీనివాస్గౌడ్ 30 కేసులు పెట్టించారు. ఒకే రోజు 10 కేసులు పెట్టించారు. నా బార్షాప్ను మూసివేయించి ఇబ్బందిపెట్టారు. ఆర్థికంగా కూడా నాకు నష్టం చేయించారు. నాకు రూ.6 కోట్లు నష్టం చేశారు. నాకు రావాల్సిన డబ్బులను రాకుండా అడ్డుకున్నారు’’ అని రాఘవేంద్రరాజు తెలిపారు.
మరోవైపు మహబూబ్నగర్కు చెందిన మార్కెట్ చైర్మన్ అమరేందర్ రాజు, ఆయన సోదరులు రాఘవేంద్రరాజు, మధుసూదన్రాజు, నాగరాజు, మున్నూర్ రవి కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ‘‘ఈ విషయం విచారణలో నాగరాజే చెప్పాడు. అమరేందర్ రాజు, రాఘవేంద్రరాజు, మధుసూదన్ రాజు, మున్నూర్ రవి డిల్లీలో మాజీ ఎంపీ జితేందర్రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్లో తలదాచుకున్నట్లు వెల్లడించాడు. ఆ మేరకు టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించిన పోలీసులు నిందితులు డిల్లీలోనే ఉన్నట్లు గుర్తించారు. నిందితులకు మాజీ ఎంపీ జితేందర్రెడ్డి డ్రైవర్ తాప, ఆయన పీఏ రాజు ఆశ్రయం కల్పించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసుల బృందం డిల్లీకి వెళ్లి వారిని గుర్తించి అరెస్టు చేసి హైదరాబాద్కు తెచ్చారు. వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లు. 8రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్రరాజు, మున్నార్ రవి, మధుసూదన్ రాజు, అమరేందర్రాజును పోలీసులు విచారించగా వారంతా కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నినట్లు వెల్లడించారు.’’ అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.