ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-01-24T05:37:15+05:30 IST
త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి బలమైన కేడర్ ఉన్న గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు పోటీకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పార్టీ శ్రేణులకు సూచించారు.
పామూరు, జనవరి 23: త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి బలమైన కేడర్ ఉన్న గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు పోటీకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక జీవైఆర్ భవన్లో మండల స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ తరుణంలో కేంద్రం చమురు ధరలు పెంచి పేదల నడ్డి విరిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. అర్హులైన వారికి ఇంటి స్థలాలు రాకున్నా అలాంటి వారిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ సభ్యత్వాలు పూర్తి చేసి జిల్లాకు పంపాలని కోరారు. సమావేశంలో రాగి నారాయణ, మౌలాలి, సుబ్బారావు, మస్తాన్రావు, సీతారాములు, మోహన్, పి రఘునాధరెడ్డి, నరశింహారావు, నాగరాజు, సురేష్ పాల్గొన్నారు.