ఎస్డీపీఐపై నిషేధం విధించనున్న యడియూరప్ప?
ABN , First Publish Date - 2020-08-15T17:55:24+05:30 IST
సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) తో పాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ను
బెంగళూరు : సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) తో పాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ను యడియూరప్ప ప్రభుత్వం రద్దు చేసే దిశగా సాగుతోంది. బెంగళూరు అల్లర్లలో ఈ పార్టీ హస్తం ఉందని తేలిపోవడంతో పాటు మరికొన్ని కారణాల రీత్యా ఎస్డీపీఐ పై నిషేధం విధిస్తారని మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప ప్రకటించారు. ఈ నెల 20 న జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
సమాజంలో అశాంతిని కలిగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున వాటిపై నిషేధం విధించాలని చాలా సమూహాలు, సంస్థలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని ఈశ్వరప్ప తెలిపారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి, అల్లర్ల కేసులో ఎస్డీపీఐ పాత్ర స్పష్టంగా కనబడుతోందని పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఆ సంస్థపై నిషేధం విధించాలని యడియూరప్ప సర్కార్పై తీవ్ర ఒత్తిడులు వస్తున్నట్లు సమాచారం. రెవిన్యూ మంత్రి అశోక రావు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎస్డీపీఐ, పీఎఫ్ఐ సంస్థలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని అశోక రావు తెలిపారు.