రాష్ట్రంలో వైసీపీ ఆటవిక రాజ్యం : టీడీపీ
ABN , First Publish Date - 2021-09-17T05:30:00+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ఆటవిక రాజ్యమేలుతోందని రైల్వేకోడూరు టీడీపీ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
రైల్వేకోడూరు రూరల్, సెప్టెంబరు 17: రాష్ట్రంలో వైసీపీ ఆటవిక రాజ్యమేలుతోందని రైల్వేకోడూరు టీడీపీ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన రైల్వేకోడూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ భౌతిక దాడులతో ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని ముఖ్యమంత్రి జగన్రెడ్డిని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడి సిగ్గుమాలిన చర్య అని ఖండించారు. నారా లోకేశ్ నరసరావుపేటకు వెళ్ళకుండా ఆపిన పోలీసులు జోగి రమేష్ను ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఎలా ఇచ్చారని డీజీపీని ప్రశ్నించారు. డీజీపీ తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మ శివ, ఓబులవారిపల్లి మాజీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, మాజీ శాప్ డైరెక్టర్ దుద్యాల జయచంద్ర దళిత నాయకులు చిన్న, పులేల రమేష్ తదితరులు పాల్గొన్నారు
రైల్వేకోడూరు..: నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెలే జోగి రమేష్ దాడి నీచ రాజకీయాలకు తెరలేపిందని టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి భద్రత కరువైతే ఇక సామాన్యులు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం సీఎం మెప్పు కోసం ఎమ్మెల్యే జోగి రమేష్ బరితెగింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. టీడీపీ నిరసనలు ముందస్తుగా అడ్డుకుంటున్న పోలీసులు జోగి రమేష్ అతని అనుచరులను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. దాడికి నైతిక బాధ్యత వహిస్తూ డీజీపీ తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
రాయచోటి..: నారా చంద్రబాబునాయుడు నివాసంపై దాడి చేయడం వైసీపీ పిరికిపంద చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్బాషా అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీనే ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.