మహిళలపై వైసీపీ పాలకుల చిన్నచూపు
ABN , First Publish Date - 2021-12-02T06:30:25+05:30 IST
వైసీపీ పాలకులు మహిళలను అడుగడుగునా చిన్నచూపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు బుద్ద నాగజగదీశ్వరరావు, పీలా గోవిందసత్యనారాయణ సూచించారు.
వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి
టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు బుద్ద, పీలా
కశింకోట, డిసెంబరు 1: వైసీపీ పాలకులు మహిళలను అడుగడుగునా చిన్నచూపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు బుద్ద నాగజగదీశ్వరరావు, పీలా గోవిందసత్యనారాయణ సూచించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కాయల మురళీధర్ అధ్యక్షతన తాళ్లపాలెంలో బుధవారం జరిగిన టీడీపీ గౌరవసభలో వారు మాట్లాడారు. చట్టసభల్లో మహిళలను తిట్టిపోస్తున్నారని, రాజధాని అమరావతి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న మహిళలపై లాఠీచార్జి చేయిస్తున్నారని అన్నారు. శాసనసభలో సీఎం జగన్ సాక్షిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిపక్ష నేత చంద్రబాబు భార్యపై వ్యక్తిగత దూషణలకు దిగడం రాష్ట్ర ప్రజలంతా గమనించారన్నారు. వైసీపీ పాలనలో నోరు విప్పితే బూతులు మాట్లాడడం తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. నిత్యావసర ధరలకు రెక్కలు రావడంతో పాటు పెట్రోల్, డిజీల్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఈ సందర్భంగా గౌరవసభ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ, పెంటకోట రాము, వేగి గోపి, సిదిరెడ్డి శ్రీను, ఉగ్గిన రమణమూర్తి, చెవ్వేటి గోవిందమ్మ పాల్గొన్నారు.