వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

ABN , First Publish Date - 2022-04-04T09:30:19+05:30 IST

కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజా వద్ద వైసీపీకి చెందిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు..

వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

టోల్‌ప్లాజా సిబ్బందిపై కట్టెలతో దాడి.. కర్నూలు జిల్లాలో ఘటన


డోన్‌/కృష్ణగిరి ఏప్రిల్‌ 3: కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజా వద్ద వైసీపీకి చెందిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు ఆదివారం వీరంగం సృష్టించారు. తమ వాహనానికే అనుమతి ఇవ్వరా? అంటూ టోల్‌ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో టోల్‌ప్లాజా సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. ఎమ్మెల్యే శ్రీదేవి తుగ్గలి మండలంలో పర్యటన ముగించుకుని డోన్‌ హైవే మీదుగా కర్నూలుకు బయలుదేరారు. అమకతాడు టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే వాహనానికి అనుమతి ఇచ్చారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్యే అనుచరులు టోల్‌ రుసుం చెల్లించకపోవడంతో గేటు అడ్డుగా వేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. తమ వాహనాన్నే అడ్డుకుంటారా? అంటూ.. దుర్భాషలాడుతూ కర్రలతో టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. దీంతో కొందరు సిబ్బంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఘటనపై తమకు ఎలాంటి సమాచారమూ లేదని కృష్ణగిరి ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని టోల్‌ప్లాజా మేనేజర్‌ మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది.   

Updated Date - 2022-04-04T09:30:19+05:30 IST