నీకు మెంటలా..?

ABN , First Publish Date - 2020-09-19T08:44:40+05:30 IST

‘నీకు మెంటలా..? నేనేం చెప్పాను.. నువ్వు ఏంచేస్తున్నావు...? పట్టుకున్న రోజే బండ్లు వదిలేయమన్నానుగా.. ఏం తమాషాగా ఉందా...! నేను తలుచుకుంటే రెండు నిమిషాల్లో వెళ్లిపోతావ్‌’ అని ఓ

నీకు మెంటలా..?

నేనేం చెప్పాను.. నువ్వేం చేస్తున్నావ్‌?

పట్టుకున్న రోజే బండ్లు వదలమన్నాగా? 

ఎమ్మెల్యే చెప్పినా లెక్కలేదా?

ఆరోజు నా కాళ్లు పట్టుకుని పోస్టింగు 

తలచుకుంటే 2 నిమిషాల్లో వెళ్లిపోతావ్‌

సీఐపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి చిందులు


గుంటూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘నీకు మెంటలా..? నేనేం చెప్పాను.. నువ్వు ఏంచేస్తున్నావు...? పట్టుకున్న రోజే బండ్లు వదిలేయమన్నానుగా.. ఏం తమాషాగా ఉందా...! నేను తలుచుకుంటే రెండు నిమిషాల్లో వెళ్లిపోతావ్‌’ అని ఓ సీఐపై  గుంటూరుజిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం ఆమె నియోజకవర్గంలోని క్వారీల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమార్కులు తన అనుయాయులే కావడంతో ఆమె నేరుగా సీఐకి ఫోన్‌ చేశారు. ఎలాంటి కేసూ పెట్టకుండా ఆ బండ్లు విడిచి పెట్టాలని హుకుం జారీ చేశారు. అయితే సీఐ ఆమె మాటలను లెక్క చేయకుండా వాహనాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియడంతో ఆమె ఆయనకు ఫోన్‌ చేసి చెడామడా తిట్టేసి బెదిరించారు. వారి సంభాషణల ఆడియో టేపు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఆమె ఫోన్‌ చేసిన సమయంలో ఎస్పీ గారి సెట్‌ కాన్ఫెరెన్స్‌లో ఉన్నానని సీఐ చెబుతున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. ‘నా మాటంటే లెక్క లేదా..? ఆ రోజు నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్‌ వేయించుకున్నావు. నీ పోస్టెంత.. నువ్వెంత? నేనిప్పుడే ఎస్పీ, డీజీపీతో మాట్లాడతా..’ అని బెదిరించారు. ‘మీరు చెబితే వేరే పనైతే చేస్తాం మేడం.. మట్టి, ఇసుక దొంగ బండ్లు మేడం. ప్రభుత్వ పాలసీ మేడం. ఒకరిని వదిలేస్తే ఇంకొకళ్లను పట్టుకోలేం మేడం. ఇటువంటి వాటి మూలంగా మాకే కాదు... మీకు కూడా బ్యాడ్‌ నేమ్‌ వస్తుంది’ అని సీఐ చెప్తున్నా ఆమె వినిపించుకోలేదు.

Updated Date - 2020-09-19T08:44:40+05:30 IST