మేం ఏమైనా చూస్తూ కూర్చుంటామా?: ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-11T23:38:51+05:30 IST

జిల్లాలోని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులపై అనుచిత

మేం ఏమైనా చూస్తూ కూర్చుంటామా?: ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి

అనంతపురం: జిల్లాలోని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే "మేం ఏమైనా చూస్తూ కూర్చుంటామా?" అని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారం లేకపోతే ఒక్క క్షణం ఉండలేరన్నారు. జగన్‌ను చంపి టీడీపీ అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. వైసీపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మల్లాది వాసు ఓ అనామకుడని ఆయన పేర్కొన్నారు. అంబటి, కొడాలి నాని, వల్లభనేని వంశీని హత్యచేస్తే రూ.50 లక్షలు ఇస్తానంటాడా  అని ఆయన ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలను చంద్రబాబు, బాలకృష్ణ ఎందుకు ఖండించలేదని ఆయన సూటిగా నిలదీశారు. 


టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాము పార్టీలో చేర్చుకోలేదన్నారు. సైకిల్‌ గుర్తుపై గెలిచిన ఏ ఒక్కరినీ తాము వైసీపీలోకి తీసుకోలేదన్నారు. గతంలో మీరు చేసిన అరాచకాలకు పరిటాల రవీంద్రను ముందు పెట్టి టీడీపీ పండుగ చేసుకుందని ఆయన ఆరోపించారు. 




వైసీపీ నాయకులను చంపితే సుపారీ ఇస్తానన్న మల్లాది వాసు అభిమానుల పేరుతో అనంతపురంలో ఫ్లెక్షీలు వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను గద్దెదించి ఆయనపై చెప్పులు వేయించి సీటు లాక్కోని కూర్చుంటే అది గౌరవ సభ అంటారా అని నిలదీశారు. మహిళలకు నేరుగా అకౌంట్లలో డబ్బులు వేస్తూ వారి గౌరవం నిలిపి వ్యక్తి సీఎం జగన్ అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడుతుంటే ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకొని నెల రోజుల కిందట వంశీ మాట్లాడిన మాటలను సభలో అన్నట్లు సృష్టించి డ్రామా రక్తి కట్టించారని ఆయన ఆరోపించారు.


స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా రూ.250 కోట్లు షెల్ కంపెనీలకు వెళ్లినట్లు కేసు నమోదైందన్నారు. అందులో భాగమే నిన్న చంద్రబాబు ఓఎస్డీ లక్ష్మీ నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు చేసిందన్నారు. జగన్‌ను హత్య చేసైనా అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తోందన్నారు. 



Updated Date - 2021-12-11T23:38:51+05:30 IST