వైసీపీ నేతలవి దిగజారుడు మాటలు: పయ్యావుల

ABN , First Publish Date - 2021-11-27T01:49:03+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును

వైసీపీ నేతలవి దిగజారుడు మాటలు: పయ్యావుల

అనంతపురం: రాష్ట్రంలో వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును ఏ రకంగానూ ఎదుర్కోలేకనే చివరికి ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు కుటుంబసభ్యులను అడ్డుపెట్టుకొని దిగజారుడుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా మరుగున పరిచేందుకే గొప్ప నాయకుడైన చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. తమ నాయకుడితో పాటు ఆయన భార్య భువనేశ్వరీ గురించి మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కలచివేశాయన్నారు. 


భువనేశ్వరీ ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఆమె సేవా కార్యక్రమాలు చేయడంలోనే నిమగ్నమయ్యారన్న విషయం గుర్తుంచుకోవాలని కేశవ్ అన్నారు. ఆమెపై మాట్లాడిన మాటలు చాలా బాధాకరమన్నారు. ఆ మాటలు ఎవరు మాట్లాడినా సరైంది కాదన్నారు. ఎవరైతే తమ నాయకుడి సతీమణిపై దిగజారుడు మాటలు మాట్లాడారో అలాంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 20 మంది పోలీసులతో భద్రత కల్పిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. భువనేశ్వరిపై మాట్లాడిన మాటలకు బాధపడి తమ పార్టీ మహిళలు ప్రతి విమర్శలు చేస్తే పోలీసులతో దాడులు చేయించడం ఏ మేరకు సమంజసమని కేశవ్ ప్రశ్నించారు.

Updated Date - 2021-11-27T01:49:03+05:30 IST