వైసీపీ నేతల బాహాబాహీ
ABN , First Publish Date - 2020-11-29T06:31:22+05:30 IST
నగరంలోని ఉత్తరం నియోజకవర్గం పరిధిలోని 12వ వార్డులో వైసీపీ నాయ కుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పోలీసుల సాక్షిగా కొట్టుకున్నారు.
తనను పీలా వెంకటలక్ష్మి కొట్టిందంటూ మాజీ కార్పొరేటర్ భర్త పోతు సత్యనారాయణ ఫిర్యాదు
సీతంపేట, నవంబరు 28: నగరంలోని ఉత్తరం నియోజకవర్గం పరిధిలోని 12వ వార్డులో వైసీపీ నాయ కుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పోలీసుల సాక్షిగా కొట్టుకున్నారు. తనను వైసీపీ నాయకురాలు కొట్టిందంటూ మాజీ కార్పొరేటర్ పోతు నాగమణి భర్త పోతు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. సీఐ ప్రేమ్కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం...బిల్డింగ్ ప్లాన్ లేదంటూ పోతు సత్యనారాయణ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న తమ వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారని జ్యోతి, శేషు అనే ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీఐ పిలుపు మేరకు స్టేషన్కు వస్తున్నతనపై స్టేషన్ బయట సునీల్, పీలా అనురాగ్ (సునీల్ స్నేహితుడు), మరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి కొట్టారని, చంపేస్తామని బెదిరించారని సత్యనారా యణ ఆరోపిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు తాను స్టేషన్ లోపలకు వెళ్లగా అప్పటికే అక్కడవున్న జ్యోతి, శేషుతోపాటు 12వ వార్డుకు చెందిన వైసీపీ నాయకురాలు పీలా వెంకటలక్ష్మి వాగ్వాదానికి దిగారని తెలిపారు. ఈ సందర్భంగా పీలా వెంకటలక్ష్మి దురుసుగా ప్రవర్తించి తనపై చేయి చేసుకుందని సత్యనారాయణ చెబుతున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దీనిపై సీఐ మాట్లాడుతూ ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు అందించారని, విచారణ జరుపుతున్నామని తెలిపారు.