ట్రాన్స్ఫార్మర్లకు అనుమతి ఇవ్వలేదని ఆందోళన
ABN , First Publish Date - 2022-05-18T05:06:56+05:30 IST
రొయ్యల చెరువుల సాగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని కృష్ణపట్నం ఆక్వారైతులు మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యా యలం వద్ద ఆందోళన చేశారు.
వైసీపీ నాయకులు, ఎస్ఐ మధ్య వాగ్వివాదం
ముత్తుకూరు, మే17: రొయ్యల చెరువుల సాగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని కృష్ణపట్నం ఆక్వారైతులు మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యా యలం వద్ద ఆందోళన చేశారు. ఇప్పటికే పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణపట్నం ఉపసర్పంచు అయిన మంత్రి కాకాణి అనుచరుడు రాగాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరగడం గమనార్హం. తహసీల్దారు కార్యాలయంలోకి ఉద్యోగులను వెళ్లనివ్వకుండా గేటు వద్ద వైసీపీ నాయకులు, ఆక్వా రైతులతో కలసి బైటాయించారు. ఎస్ఐ శివకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఉద్యోగులను అడ్డుకోవడం సరికాదని చెప్పేందుకు ప్రయత్నించారు. దాంతో రాగాలకు ఎస్ఐకి మధ్య వాగ్వివాదం జరిగింది. ఉద్యోగులను కార్యాలయం లోపలకి పంపించే సమయంలో రాగాల వర్గీయులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గేటు వద్ద ఉండవద్దని చెప్పిన ఎస్ఐతో మీరు నన్నేమి చేయలేరంటూ రాగాల మాట్లాడడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఈ విషయమై తహసీల్దారు సోమ్లానాయక్ స్పందిస్తూ ప్రభుత్వ, పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు అనుమతులు లేవన్నారు. ఏవైనా పత్రాలు ఉంటే పరిశీలించి ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు అనుమతించే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులను విధులకు వెళ్లనీయకుండా అడ్డుకున్నందుకు రాగాల, పలువురు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.