వైసీపీ నేత బెదిరింపులకు వృద్ధుడు బలి
ABN , First Publish Date - 2022-05-15T08:44:21+05:30 IST
అధికార పార్టీ నేత కక్ష సాధింపులు, బెదిరింపులకు ఓ వృద్ధుడు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి రైల్వేస్టేషన్లో నారాయణ (80) ఆత్మహత్య చేసుకున్నాడు..
కక్ష సాధింపుతో ఆత్మహత్య
బంధువుల ఫిర్యాదును స్వీకరించని పోలీసులు
బుక్కపట్నం, మే 14: అధికార పార్టీ నేత కక్ష సాధింపులు, బెదిరింపులకు ఓ వృద్ధుడు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి రైల్వేస్టేషన్లో నారాయణ (80) ఆత్మహత్య చేసుకున్నాడు.. 2018లో బుక్కపట్నం మండలం మారాల గ్రామంలో తలెత్తిన గొడవ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి.. తనను కులం పేరుతో దూషించాడంటూ అదే ఊరికి చెందిన పరశురాం నాయక్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈకేసులో నారాయణ సాక్షి. గత నెల 6న అనంతపురంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. సుధాకర్రెడ్డికి వ్యతిరేకంగా నారాయణ సాక్ష్యం చెప్పాడు. దీంతో కక్ష పెంచుకున్న సుధాకర్రెడ్డి, నారాయణ పింఛన్ను రద్దు చేయించాడు. ‘నిన్ను, నీ కుటుంబాన్ని అంతం చేస్తా’ అంటూ బెదిరించాడు. దీంతో ఆవేదనకు లోనైన నారాయణ ఉరేసుకున్నాడు.