‘రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ సర్కారు’
ABN , First Publish Date - 2021-08-20T15:00:40+05:30 IST
అధికారం కోసం అడ్డగోలుగా..
సత్తెనపల్లి: అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటి అమలుకోసం రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాసరావు, తెలుగుయువత రాష్ట్ర నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావులు ధ్వజమెత్తారు. గురువారం ఎన్టీ ఆర్ భవన్లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వపథకాల లబ్ధిదారులను తగ్గించేందుకు ఈకేవైసీ, ఆధార్ అనుసంధానం వంటి వాటిని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దీని వలన తల్లిదండ్రులు, పిల్లలు ఆధార్ కేంద్రానికి అధిక సంఖ్యలో రావటం వల్ల కరోనా భయం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందిపెట్టే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కితీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గుంటూరులో దళిత విద్యార్థిని రమ్య హత్య ఘటన మరువక ముందే రాజుపాలెంలో దళిత బాలికపై అత్యాచారం జరగటం బాధాకరమన్నారు. ఈ ఘటనలో దోషులను వెంటనే అరెస్టుచేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. సమావేశంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు, నేతలు మారెళ్ల మల్లేశ్వరరావు, పోట్ల ఆంజనేయులు, కోయ లక్ష్మయ్య, ఎ.అమరేశ్వరరావు, రవిచంద్ర, చంద్రశేఖర్, శివప్రసాద్, లోకేశ్వరరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.