వైసీపీ ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-05T01:30:12+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి: చంద్రబాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయనగరం లచ్చయ్య పేటలో చెరకు బకాయిలు చెల్లించాలని నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో అన్నదాతలపై అక్రమ కేసులు సిగ్గుచేటని దుయ్యబట్టారు. అన్యాయానికి గురైన రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే నియంతలా వ్యవహరించటం సరికాదని తప్పుబట్టారు. పొలంలో వ్యవసాయం చేస్తూ సమాజ సేవ చేసే రైతులను సీఎం జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ సమస్యల కోసం నిరసన తెలిపిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‎ రైతులంటే చులకన భావంతో చూస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతులపై  తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారని, ఇప్పుడు చెరకు ‎రైతులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అక్రమ కేసులు వెంటనే ఎత్తివేసి, వారికి తక్షణమే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-05T01:30:12+05:30 IST