బీజేపీతో స్నేహాన్ని కోరుకుంటున్న వైసీపీ
ABN , First Publish Date - 2022-05-20T08:29:22+05:30 IST
‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ షరతులకు తలొగ్గి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రజలపై భారం మోపుతోంది. బీజేపీతో వైసీపీ
అందుకనే షరతులకు తలొగ్గుతోంది
హక్కులకు భంగం కలుగుతున్నా ప్రశ్నించడం లేదు: బీవీ రాఘవులు
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజోతి): ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ షరతులకు తలొగ్గి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రజలపై భారం మోపుతోంది. బీజేపీతో వైసీపీ స్నేహాన్ని కోరుకుంటోంది. అందువల్లే రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తున్నా ప్రశ్నించడం లేదు’’ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. విశాఖలో కొత్తగా నిర్మించిన అల్లూరి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రం సూచించిన సంస్కరణలకు తలొగ్గి రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తోంది. విద్యుత్ చార్జీలు పెంపు, చెత్తపన్ను విధింపు వంటి విధానాలను అమలు చేస్తోంది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తున్నట్టు కనిపించడం లేదు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సంపాదించే లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉంది. స్టీల్ప్లాంట్ విషయంలో అధికార పార్టీకి దమ్ముంటే కార్మికుల పక్షాన నిలిచి పోరాటం చేయాలి.
బీజేపీ నుంచి సీట్లను లాక్కోవడం, బీజేపీని ఓడించడం లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం అన్ని రాజకీయపార్టీలపైనా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ చతికిలపడిపోతోంది. చింతన్ బైఠన్ అని చర్చలు చేస్తే సరిపోదు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంది. ’’ అని రాఘవులు అన్నారు.
పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులు
సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ నేతలు గురువారం నివాళులు అర్పించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కె.మధు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.