వైసీపీ వర్గ పోరులో మరొకరు బలి
ABN , First Publish Date - 2022-05-15T08:33:04+05:30 IST
వైసీపీ వర్గ పోరులో మరొకరు బలి
పశ్చిమ గోదావరి జిల్లాలో మరో దారుణం
ఆటో పార్కింగ్పై ప్రశ్నించినందుకు గొడవ
గుంపుగా వచ్చి... దాడి చేసి హత్య
స్థానిక ఎంపీపీతో మృతుడికి విభేదాలు
అసమ్మతి నాయకుడిగా ముద్ర
వైసీపీలో వర్గ పోరుకు మరొకరు బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గంజి నాగప్రసాద్ హత్యను మరిచిపోకముందే.. మరొకరు దారు ణ హత్యకు గురయ్యారు. ముదినేపల్లికి చెందిన మాల మహానాడు నేత, వైసీపీ గ్రామ నేత వర్రె నాగేంద్ర(39)ను కత్తులతో పొడిచి చంపారు. అడ్డొచ్చిన సమీప బంధువు అరుగుల మహేశ్(29)పైనా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో వర్రె నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా... మహేశ్ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయం లో ఈ సంఘటన చోటుచేసుకుంది. నరేంద్రను అధికార పార్టీ నాయకులే హత్య చేశారని ఆయన భార్య, బంధువు లు ఆరోపిస్తున్నారు.
స్థానిక ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణతో వర్రె నాగేంద్రకు కొన్నాళ్లుగా విభేదాలున్నాయని.. ప్రశ్నించడాన్ని సహించలేకే ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. వారి కథనం ప్రకారం.. ముదినేపల్లి మసీదు సెంటర్లో నివసిస్తున్న షేక్ ఇర్ఫాన్(32) శుక్రవారం రాత్రి తన ఆటోను నిలిపేసి వెళ్తుండగా.. నరేంద్ర తల్లి మరియ మ్మ అడ్డుకుంది. తన ఇంటి ముందు, రోడ్డు మధ్యలో ఆటో పార్క్ చేయవద్దని ఎన్నిసార్లు చెబుతున్నా ఎందుకు వినడంలేదని నిలదీసింది. ఇర్ఫాన్ కోపంతో ఊగిపోతూ ఆమె ను దుర్భాషలాడాడు. పెయ్యేరు పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో ఉండే భార్య తరఫు బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే... దూబే శ్రీకాంత్, చంద్రకాంత్తోపాటు 10 మందితో ఇర్ఫాన్ ఆటోలో మరియమ్మ ఇంటికి వచ్చారు. ఆటో పార్కింగ్పై తలెత్తిన వివాదాన్ని పక్కన పెట్టి... ‘నీ కొడుకు ఎక్కడ?’ అంటూ కేక లు వేయడం మొదలుపెట్టారు. ఈ కేకలు విని తల్లి ఇంటికి సమీపంలోనే మరో ఇంట్లో నివాసం ఉంటున్న నాగేంద్ర అక్కడికి వచ్చారు. నాగేంద్రను చూడగానే కత్తులతో దాడి చేశారు. నాగేంద్రను ఇర్ఫాన్ పట్టుకోగా.. మరొక వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. అడ్డొచ్చిన మహేశ్పైనా కత్తులతో దాడి చేశారు. ఆ తర్వాత తాము వచ్చిన ఆటోలోనే అక్కడి నుంచి పారిపోయారు. నాగేంద్ర హత్యకు ఉపయోగించిన ‘కొక్కెం కత్తులు’ ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అసమ్మతి నేతగా ముద్ర
హత్యకు పాల్పడిన యువకులు అదే రోజు పెళ్లి వేడుక లో రోజంతా పూటుగా మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన నేత ఆధ్వర్యంలో మం డల స్థాయి ప్రజా ప్రతినిధిని రహస్యంగా కలిశారని, అక్క డ అందిన సూచనల మేరకే నాగేంద్రను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తానూ వైసీపీలోనే ఉన్నప్పటికీ... స్థానిక నాయకులతో నాగేంద్రకు విభేదాలున్నాయి. ఇటీవల వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా నాగేంద్ర అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీపీలకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో పోలీసులు ఆయనను స్టేషన్కు తరలించారు. దీనికి నిరసనగా వైసీపీ అసమ్మతి వర్గానికి చెందిన మహిళలు రాస్తారోకో చేశారు.
ముదినేపల్లిలో టెన్షన్ - టెన్షన్
నాగేంద్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శనివారం సాయంత్రం 5 గంటలకు ముదినేపల్లి తీసుకువచ్చారు. అదే వ్యానులో వచ్చిన నాగేంద్ర భార్య జ్యోతి తన భర్త మృతదేహాన్ని వ్యాను నుంచి కిందికి దింపేందుకు అంగీకరించకుండా అడ్డంగా నిలబడ్డారు. తన భర్తను చంపిన వ్యక్తులను తన ఎదుట నిలబెట్టాలని, వారి శవాలను చూశాకే మృతదేహాన్ని వ్యాను నుంచి దింపాలని డిమాండ్ చేస్తూ బోరు బోరున విలపించారు. సుమారు రెండు గంటలపాటు మృతదేహాన్ని వ్యాను నుంచి కిందికి దించనివ్వలేదు. పెద్ద సంఖ్యలో దళితులు, మైనార్టీలు వ్యానును చుట్టూముట్టారు. నిందితులపై హత్య కేసు నమోదు చేశామని, ఎవరినీ వదిలి పెట్టేది లేదని పోలీసులు హామీ ఇవ్వటంతోపాటు... కొందరు బంధువులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు.