పోలీసుల సహకారంతోనే వైసీపీ దాడులు: అయ్యన్న
ABN , First Publish Date - 2021-10-21T02:23:51+05:30 IST
పోలీసుల సహకారంతోనే రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులు జరిగాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
నర్సీపట్నం: పోలీసుల సహకారంతోనే రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులు జరిగాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయాలపై రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఎవరెవరు దాడులు చేశారో సీసీ పుటేజీ తీస్తే తెలిసిపోతుందన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ పోస్టు విలువ తీసేస్తున్నారని విమర్శించారు. దాడులు చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకోవాలని, రాష్ట్రంలో పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. బంద్లు, ధర్నాలకు పిలుపునివ్వడం వల్ల ఫలితం ఉండదని, ఏదైనా వుంటే ముఖాముఖి తేల్చేసుకోవాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్యం లేనిచోట బంద్కు పిలుపునివ్వడం వల్ల వ్యాపారులు ఇబ్బందిపడడం తప్ప మరో ఉపయోగం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం వున్న ప్రతి ఒక్కరూ ఈ దాడులను ఖండించాలని అయ్యన్నపాత్రుడు కోరారు.