జగన్ పాలనతో ఏపీకి తీరని నష్టం: మాజీ మంత్రి యనమల
ABN , First Publish Date - 2021-11-11T18:31:46+05:30 IST
జగన్మోహన్ రెడ్డి అసమర్థపాలన వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టమని టీడీపీ నేత యనమల అన్నారు.
నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి అసమర్థపాలన వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టమని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో తిరోగమనంలో వృద్ధి రేటు ఉందని, దీనివల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతోందన్నారు. ఏ సీఎం కూడా ఇంత దారుణంగా పరిపాలించలేదని పేర్కొన్నారు. జగన్ తాత లక్షణాలు పుణికిపుచ్చుకున్నారని విమర్శించారు.
కష్టపడి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకుంటే.. జగన్ తన సొంతానికి వాడుకుంటూ నిరంకుశపాలన చేస్తున్నారని యనమల మండిపడ్డారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని, ఏపీలో ఎవరూ రూపాయి పెట్టుబడిపెట్టే పరిస్థితిలేదన్నారు. జగన్ విధానాల వల్ల భవిష్యత్లో యువత చాలా నష్టపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదని, ఆ హక్కును కోల్పోయారన్నారు. తాను 39 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానని, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణంగా పరిపాలన చేయలేదని యనమల తీవ్రస్థాయిలో విమర్శించారు.
సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, నిరంకుశత్వపాలన సాగిస్తున్నారని యనమల విమర్శించారు. ఆఫ్ ది వైసీపీ, ఫర్ ది వైసీపీ, బై ది వైసీపీ అన్న చందంగా పరిస్థితి నెలకొందన్నారు. జగన్ అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించడం వల్ల.. ప్రపంచంలో ఏపీ అంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నారన్నారు. వైఎస్ కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తాము 23 బెనిఫిట్స్ ఇచ్చామన్నారు. జగన్ ప్రభుత్వం ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వలేదని యనమల ఆరోపించారు.