బహిష్కరించక ఏం చేయాలి?: యనమల
ABN , First Publish Date - 2021-11-20T17:51:49+05:30 IST
శాసనసభలో అవమానిస్తూ ఆనందించే ధోరణి అధికార పార్టీలో ఉందని టీడీపీ నేత యనమల విమర్శించారు.
అమరావతి: శాసనసభలో అవమానిస్తూ ఆనందించే ధోరణి అధికార పార్టీలో ఉందని, అసభ్య పదజాలంతో, దూషణలతో అసెంబ్లీ సాగిందని టీడీపీ నేత, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే దుస్సాంప్రదాయం తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ.. ఎక్కడా విచారం వ్యక్తం చెయ్యలేదన్నారు. 37 ఏళ్ల చట్టసభ సభ్యుడిగా 10 మంది సీఎంలను చూశానన్నారు. సైకో మనస్తత్వంతో సభలో తిడుతూ ఆనందించే తీరు ఇప్పుడే చేశానన్నారు. నియంత్రించే పరిణామాలు లేనప్పుడు బహిష్కరించక ఏం చేయాలన్నారు. విపరీత పరిణామాలు ఉన్నప్పుడు... తీవ్ర నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రజలు తమ నిర్ణయాన్ని అర్ధం చేసుకుంటారని, ‘‘గతంలో ఎన్టీఆర్ కూడా నాడు మళ్ళీ సీఎంగానే సభకు వస్తాను అన్నారు... అలాగే వచ్చారు... సభలో అనుకోని పరిణామాలు, నోరు జారినప్పడు ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి సైతం సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు... కానీ ఇక్కడ జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు.. సీఎం శాడిజం తోటి సభ్యులను ప్రోత్సహించేలా ఉంది... సభ పొడిగింపు వెనుక కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయని స్పష్టం అయ్యింది... ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగిందని’’ యనమల ఆరోపించారు.