గడువుకు రెండేళ్ల ముందే యమునా జలాల ప్రక్షాళన
ABN , First Publish Date - 2022-03-22T23:54:55+05:30 IST
యమునా జలాల ప్రక్షాళన 2025 నాటికి కాకుండా 2023 డిసెంబర్ నాటికే పూర్తి చేస్తామని..
న్యూఢిల్లీ: యమునా జలాల ప్రక్షాళన 2025 నాటికి కాకుండా 2023 డిసెంబర్ నాటికే పూర్తి చేస్తామని ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మంగళవారంనాడు తెలిపారు. వృథాజలాలన్నిటినీ వచ్చే 6 నెలల్లో గొట్టాల్లోకి పంపించి, వాటిని తదుపరి 15 నెలల్లో మురుగు కాలువలకు అనుసంధానం చేస్తామని అసోచామ్తో వర్చువల్ సమావేశంలో మంత్రి తెలిపారు.
''2025 నాటికి కాకుండా 2023 డిసెంబర్ కల్లా యమునా జలాలను శుద్ధి చేస్తాం. డ్రెయిన్లన్నీ పూర్తిగా శుభ్రం చేస్తాం. చాలా ధీమాతో చెబుతున్నాం. ఢిల్లీలో యమునా నది ప్రవహించే ఎక్కడైనా సరే స్నానాలు చేసేందుకు మిమ్మల్ని తప్పని సరిగా ఆహ్వానిస్తాను'' అని మంత్రి వర్చువల్ మీట్లో భరోసా ఇచ్చారు. రాబోయే ఐదు నుంచి పదేళ్లలో ఢిల్లీలోని గ్రౌండ్వాటర్ టేబుల్ 50 ఏళ్ల క్రితం కంటే మెరుగ్గా ఉంటుందని చెప్పారు. సిటీకి శివార్లలోని పల్లా (ఢిల్లీ-హర్యానా సరిహద్దులకు సమీపంలో) వద్ద నున్న 25 ఎకరాల భూమిలో ఎక్స్పెర్మెంట్ చేశామని, అది విజయవంతమైందని, అదే తరహా ఎక్స్పెర్మెంటే ఇప్పుడు చేస్తామని చెప్పారు. కాగా, 2025 నాటికి యమునా జలాల ప్రక్షాళన పూర్తి చేస్తామని కొద్దికాలం క్రితం కేజ్రీవాల్ ప్రకటించారు.