Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2022-08-08T01:55:04+05:30 IST

యాదగిరి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శ్రావణమాసం, వారాంతపు సెలవురోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రి: యాదగిరి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శ్రావణమాసం, వారాంతపు సెలవురోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దర్శనాలు, మొక్కుపూజల క్యూలైన్లలో భక్తుల సంచారంతో కోలాహలం నెలకొంది. స్వామివారి ధర్మదర్శనాలకు సుమారు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.25,83,728 ఆదాయం సమకూరింది. యాదగిరి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో ఆదివారం నిత్యారాధనలు, కోటికుంకుమార్చన పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలో స్వయంభువులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ప్రధానాలయ ఈశాన్య ప్రాకార మండపంలో మహాలక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ కోటికుంకుమార్చన పూజలు నిర్వహించారు. కుంకుమార్చనపూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు.

Updated Date - 2022-08-08T01:55:04+05:30 IST