యాదాద్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

ABN , First Publish Date - 2022-03-15T01:52:11+05:30 IST

విశ్వశాంతి, లోకకల్యాణం కోసం 11రోజులపాటు శాస్త్రోక్తంగా సాగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

యాదాద్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

యాదాద్రి: విశ్వశాంతి, లోకకల్యాణం కోసం 11రోజులపాటు శాస్త్రోక్తంగా సాగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో సోమవారం పరిసమాప్తమయ్యాయి. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు కొనసాగుతున్నందున నృసింహుడి బ్రహ్మోత్సవాలను ఆగమ నియమానుసారం బాలాలయంలోనే నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఉత్సవ మండపంలో 108కలశాలను ఏర్పాటుచేసి, 108ద్రవ్యాలు, 108 ఔషధాలు, 108మంత్ర జపాలతో వేదయుక్తంగా అర్చించారు. ఈ 108ఘటాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించి, అవిశ్శులు సమర్పించారు. అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించి శ్రీస్వామి వారికి శాంతి అభిషేకం చేశారు. ఉత్సవాల్లో పారాయణాలు చేసిన రుత్వికులకు పండిత సన్మానం చేశారు. సోమవారం రాత్రి లక్ష్మీనరసింహులకు విశేష అలంకారం చేసి బాలాలయ ఉత్సవ మండపంలో అధిష్ఠింపజేశారు. కల్యాణ లక్ష్మీనరసింహులకు శృంగార డోలోత్సవం నిర్వహించారు.

Updated Date - 2022-03-15T01:52:11+05:30 IST