నిండుకున్న ముడిసరుకులు

ABN , First Publish Date - 2020-08-08T10:11:15+05:30 IST

నేతన్నలకు గడ్డుకాలం నడుస్తోంది. మగ్గాలు మూగబోయాయి. ముడిసరుకు నిల్వలు నిండుకోవడం, నూలు కొరతతో పని ..

నిండుకున్న ముడిసరుకులు

అప్పుల కోసం నేతన్నల తిప్పలు 

ప్రభుత్వం కొనుగోలు చేయాలని వేడుకోలు

‘చేయూత’ను వర్తింపజేయాలనివినతి 


నేతన్నలకు గడ్డుకాలం నడుస్తోంది. మగ్గాలు మూగబోయాయి. ముడిసరుకు నిల్వలు నిండుకోవడం, నూలు కొరతతో పని నిలిచిపోయింది. మరో వైపు షావుకార్లు నూలు (ఎంట్లు) ఇవ్వడం నిలిపివేశారు. వారి దగ్గర కూడా నిల్వలు లేకపోవడం అందుకు కారణమైంది. దీంతో సాధారణ చేనేత కార్మికులకు పూట పగవడం కష్టంగా మారింది. అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్నలకు చేయూత వందలాది మంది కార్మికులకు అందలేదు. నేతన్న నేస్తం ఫలాలూ కంటితుడుపుగా కొందరికే అందాయి.


నిబంధనల పేరుతో అర్హతలున్నా అనేక మంది మొండిచేయి చూపారు. కార్మికుల వద్ద పేరుకుపోయిన నిల్వల్లో కేవలం మాస్క్‌ల తయారీకి ఉపయోగించే వస్ర్తాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. శారీ, పంజాబీ, ధోవతి, డ్రెస్‌ మెటీరియల్స్‌ కొనేవారు కరువయ్యారు. ఇక చేనేత ఉపవృత్తులవారి పరిస్థితి దయనీయంగా మారింది. ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో పడరానిపాట్లు పడుతున్నారు. 


చీరాల, ఆగస్టు 7 : చేనేత మగ్గాలు మూలనపడుతున్నాయి. జిల్లాలో ఏటికేడు వీటి సం ఖ్య తగ్గిపోతోంది. ఒకప్పుడు 20వేల పైచిలుకు ఉన్న మగ్గాలు, ప్రస్తుతం 7 వేలకు పడిపోవ డం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది నేతన్న నేస్తం పథకం కింద మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.24వేలను ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఈ ఏడాదీ నేతన్న నేస్తం అందింది. ఏడాదిపాటు మగ్గం నిర్వహించిన వారిని అర్హులుగా చేర్చుతామని ప్రభుత్వం చెప్పింది దీంతో కొందరు అప్పులు చేసి మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆవిధంగా సుమారు 2,500 మగ్గాలు నమోదయ్యాయి. అయితే వారికి ఈ ఏడాది నేతన్న నేస్తం దక్కలేదు. 


ముడిసరుకు లేదు

మగ్గం నడవాలంటే ముడిసరుకు ఉండాలి. ప్రస్తుతం నేత నేస్తున్న వారిలో 80శాతం మందికిపైగా నూలు లేక పనులు ఆపేశారు.   సాధారణంగా ఎన్‌హెచ్‌డీసీ ద్వారా మగ్గాలకు నూలు సరఫరా చేస్తారు. కొందరు వ్యాపారు లు మగ్గాలు ఉన్నవారికి నూలు ఇచ్చి, నేసిన వస్త్రాలను తీసుకుని వారికి మజూరీ ఇస్తారు. ఇలా పని ఉంటేనే నేతన్నకు పండుగ. లేకుంటే పస్తులే. ప్రస్తుతం మగ్గంపై పనిచేసేవారికి పని లేకుండాపోయింది. 


‘చేయూత’కు దూరం 

నేతన్నలు చేయూత పథకానికి దూరమయ్యారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరిగిన జాప్యంతో వందలాది కుటుంబాలు పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. 


అప్పుల కోసం ఎదురుచూపు 

చేనేత కార్మికుల చేతిలో చిల్లిగవ్వ లేదు. పూట గడవడం కోసం అప్పులు ఎవరిస్తారా అని ఎదురుచూస్తున్నారు. చీరలు, డ్రెస్‌ మెటీరియల్‌, కలంకారి తదితర వస్త్రాల తయారీ ఉత్పత్తులను కొనేవారు లేక పేరుకుపోయాయి. కరువయ్యారు. కరోనా కాలంలో  ప్రభుత్వం తమను ఆదుకోవాలని చేనేతలు కోరుతున్నారు.

Updated Date - 2020-08-08T10:11:15+05:30 IST