‘రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తారా?

ABN , First Publish Date - 2022-05-03T08:56:39+05:30 IST

‘రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తామంటే ఉపేక్షించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.

‘రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తారా?

  • హింసను ప్రోత్సహిస్తూ..సంస్కృతి అంటారా?
  • ఈ విషయాల్లో కళ్లు మూసుకుని ఉండలేం
  • హైకోర్టు తీవ్ర ఆగ్రహం
  • కొన్ని కారణాలతో వ్యాజ్యాన్ని తొలగించిన ధర్మాసనం


అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): ‘రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తామంటే ఉపేక్షించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రియాల్టీ షోలో ఏం చూపిస్తున్నారో అందరికీ తెలుసని.. అలాంటి కార్యక్రమాల విషయంలో కళ్లు మూసుకొని ఉండలేమని వ్యాఖ్యానించింది. షోలలో హింసను ప్రోత్సహిస్తున్నారని.. దానిని సంస్కృతిగా ఎలా అభివర్ణిస్తారని నిలదీసింది. వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ముందు అభ్యర్థించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. వ్యాజ్యాన్ని విచారణ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఎస్‌. సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. బిగ్‌బాస్‌ షో అసభ్యతను, అశ్లీలతను ప్రోత్సహించేదిగా ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారించాలని ఇటీవల న్యాయవాది గుండాల శివప్రసాద్‌ రెడ్డి అభ్యర్థించడంతో సోమవారం విచారణకు వచ్చింది. 


పిటిషనర్‌ సరైన కారణంతో వ్యాజ్యం వేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇదే విషయంపై పిటిషనర్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసి ఉపసంహరించుకున్నారని తెలిపారు. రియాల్టీ షోల నిర్వహణకు విధివిధానాలు ఉన్నాయన్నారు. వివిధ సంస్కృతుల ఆధారంగా షోలు ఉంటాయని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. హింసను ప్రోత్సహించడం సంస్కృతి ఎలా అవుతుందని నిలదీసింది. సీనియర్‌ న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.. ఈ వ్యాజ్యం 2019లో దాఖలైందని.. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పదిరోజుల క్రితం పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తే అనుమతి రాలేదన్నారు. పిటిషనర్‌ ఆ విషయాన్ని ఇంచార్జి కోర్టు ముందు ఉంచకుండా వ్యాజ్యంపై విచారణకు అనుమతి పొందారన్నారు. వ్యాజ్యాలపై విచారణ జరపాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరిన మాట వాస్తవమేనని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జి.శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు. వ్యాజ్యాలను విచారించాలని ఇంచార్జి కోర్టును కోరే హక్కు పిటిషనర్‌కు ఉంటుందన్నారు. కోర్టు ముందు నిజాయితీతో వ్యవహరించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. ప్రధాన న్యాయమూర్తి వ్యాజ్యాన్ని విచారణకు అనుమతించని విషయాన్ని కోర్టు ముందు ఉంచాల్సిందని వ్యాఖ్యానించింది.

Read more